ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయండి: సింగపూర్ కంపెనీ చైర్మన్ తో మంత్రి లోకేశ్‌

  • సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేశ్‌
  • ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ తో లోకేశ్‌ భేటీ
  • ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీ నైపుణ్యశిక్షణకు అంగీకారం
సీఎం చంద్ర‌బాబుతో పాటు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సైమన్ టాన్ తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌లు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేశారు. "2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024ను ప్రకటించాం. రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఏపీలో పెద్దఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నాం" అని తెలిపారు. 

ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వోల్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ఐటీఐలలో రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ కోరారు. దీనిపై ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ... ఏపీ ఎంపికచేసిన ఒక ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ... సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్ టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజి ఉత్పత్తుల్లో ప్రత్యేకతను కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 1 గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ... 2026 నాటికి 3 గిగావాట్ల చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి, ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.



More Telugu News