ఓల్డ్ ట్రాఫర్డ్ లో గిల్ సెంచరీ... బ్రాడ్ మన్ రికార్డు సమం

  • టీమిండియా-ఇంగ్లాండ్ నాలుగో టెస్టు 
  • రెండో ఇన్నింగ్స్ లో 103 పరుగులు చేసిన కెప్టెన్ గిల్
  • ఈ సిరీస్ లో గిల్ కు ఇది నాలుగో సెంచరీ
  • గతంలో ఒక సిరీస్ లో నాలుగు సెంచరీలు చేసిన బ్రాడ్ మన్, గవాస్కర్
  • దిగ్గజాల సరసన గిల్
మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ శతకంతో ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, డాన్ బ్రాడ్‌మన్ రికార్డులను (4 సెంచరీలు) సమం చేశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కి ఇది నాలుగో సెంచరీ.

ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో 700 పరుగుల మార్కును అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇంతకుముందు సునీల్ గవాస్కర్ రెండుసార్లు, యశస్వి జైస్వాల్ ఒకసారి ఈ మార్కును చేరుకున్నారు. అలాగే, ఇంగ్లాండ్ గడ్డపై ఒకే సిరీస్ లో 700కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే... టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో పట్టుదలగా ఆడుతోంది. గిల్ (103) సెంచరీతో రాణించాడు. ఓవరాల్ గా టెస్టుల్లో గిల్ కు ఇది 9వ సెంచరీ. పాపం, కేఎల్ రాహుల్ 10 పరుగులతేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. రాహుల్ 90 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 101 ఓవర్లలో 4 వికెట్లకు 269 పరుగులు కాగా... క్రీజులో రవీంద్ర జడేజా (27 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ (36 బ్యాటింగ్) ఉన్నారు. 

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి టీమిండియా ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 669 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇవాళ ఆటకు ఐదో రోజు కాగా, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


More Telugu News