చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద పెట్టుబడి: సింగపూర్ లో నారా లోకేశ్

  • సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు, లోకేశ్
  • తెలుగు డయాస్పొరాతో లోకేశ్ సమావేశం
  • ఎన్ఆర్ఐలే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) కీలక పాత్ర పోషించాలని, వారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద పెట్టుబడి అని లోకేశ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

సింగపూర్ నుండి అధిక ఎఫ్‌డీఐలు, ఏపీకి ఆశాకిరణం

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిలో సింగపూర్ నుండే అధిక శాతం వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి మొత్తం 81.04 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వస్తే, అందులో సింగపూర్ నుండి దాదాపు 14.94 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, ఇది మొత్తం ఎఫ్‌డీఐలలో 19 శాతం అని ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడుల్లో అధికశాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తే, రాష్ట్రం మరో సింగపూర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్ఆర్ఐలు కాదు, ఎంఆర్ఐలు!

ప్రవాస భారతీయులను 'మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్' (అత్యంత విశ్వసనీయ భారతీయులు-ఎంఆర్ఐ) అని అభివర్ణించారు. సింగపూర్‌లోని తెలుగువారి ఉత్సాహం అద్భుతమని, విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసినా తెలుగువారే కనిపించారని, సింగపూర్‌లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అన్నంత సందేహం కలిగిందని లోకేశ్ చమత్కరించారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారి ఆధిపత్యం కనిపిస్తోందని, సింగపూర్‌ను శాసించేది కూడా తెలుగువారేనని ఆయన అన్నారు. లీ క్వాన్ యూ తనకు ఆదర్శవంతమైన నాయకుల్లో ఒకరని, ఆయన సింగపూర్‌ను గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చారని గుర్తు చేసుకున్నారు.


More Telugu News