నేడు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న అశోక్ గజపతిరాజు

  • అశోక్ గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించనున్న బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
  • ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్
  • గోవాకు చేరుకున్న అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రభుత్వ ఉన్నతాధికారులు
గోవా గవర్నర్‌గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11:00 గంటలకు అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు హాజరుకానున్నారు.

కాగా, ప్రమాణ స్వీకార నేపథ్యంలో అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన అర్ధాంగి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతిదేవి నిన్న రాత్రే గోవాకు చేరుకున్నారు.

అశోక్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే అక్కడకు వెళ్లారు. గోవా విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికారు. 


More Telugu News