ఓపెన్ ఏఐ సీఈఓని క‌లిసిన ఏ.ఆర్ రెహ‌మాన్.. కార‌ణ‌మిదే!

  • 'సీక్రెట్ మౌంటైన్' కోసం ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలిసిన సంగీత దిగ్గ‌జం
  • ఈ స‌మావేశం గురించి ఎక్స్ ద్వారా తెలియ‌జేసిన రెహమాన్ 
  • 'సీక్రెట్ మౌంటైన్' అనే తమ వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ గురించి చర్చించిన‌ట్లు వెల్ల‌డి
ఆస్కార్ అవార్డ్ విజేత‌, సంగీత దిగ్గ‌జం ఎ.ఆర్. రెహమాన్ తన 'సీక్రెట్ మౌంటైన్ ప్రాజెక్ట్' కోసం ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలిశారు. ఈ స‌మావేశం గురించి రెహమాన్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా తెలియ‌జేశారు. ఆల్ట్‌మన్ కార్యాలయంలో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉందంటూ ఆయ‌న పోస్టు పెట్టారు.

ఈ భేటీలో తాము 'సీక్రెట్ మౌంటైన్' అనే తమ వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ గురించి చర్చించామ‌న్నారు. అలాగే సంగీత రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడినట్లు రెహమాన్ వెల్లడించారు. భారతదేశంలోని సృజనాత్మక మైండ్స్‌ను ప్రోత్సహించడానికి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ టూల్స్‌ను ఉప‌యోగించడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామ్ ఆల్ట్‌మన్‌తో దిగిన ఫొటోను కూడా రెహమాన్ పంచుకున్నారు.

కాగా, 'సీక్రెట్ మౌంటైన్' అనేది రెహమాన్ రూపొందించ‌నున్న‌ ఒక డిజిటల్, మల్టీమీడియా ప్రాజెక్ట్. ఇది 'మెటా బ్యాండ్'ను కలిగి ఉండి.. సంగీతం, సాంకేతికతతో కలగలిసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఎ.ఆర్. రెహమాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


More Telugu News