నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలో ఐదు రోజుల పాటు వర్షాలు

  • ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న ఐఎండీ
  • ఆదివారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్న అమరావతి వాతావరణ విభాగం 
అరేబియా సముద్రం నుండి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మి.మీ వర్షపాతం నమోదైంది. 


More Telugu News