ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

  • అమెరికా టారిఫ్ ల ఒత్తిడి
  • 13 పాయింట్ల తగ్గిన సెన్సెక్స్
  • 29 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
అమెరికా టారిఫ్ లపై అస్పష్టత, మదుపరుల లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు దాదాపు ఫ్లాట్ గా ముగిశాయి. ఆగస్టు 1న అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపిస్తుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ 13.53 పాయింట్లు (0.02 శాతం) తగ్గి 82,186.81 వద్ద ముగిసింది. 

అంతకుముందు రోజు 82,200 వద్ద ముగిసిన సెన్సెక్స్, మంగళవారం 82,527.27 వద్ద సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, రిలయన్స్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎల్‌ అండ్ టీ వంటి భారీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో లాభాలను కోల్పోయింది. 

నిఫ్టీ 29.80 పాయింట్లు (0.12 శాతం) క్షీణించి 25,060.90 వద్ద స్థిరపడింది. 

గడువు సమీపిస్తున్నప్పటికీ అమెరికా టారిఫ్ లపై స్పష్టత లేకపోవడం మార్కెట్‌లో అనిశ్చితికి దారితీసింది.త్రైమాసిక ఫలితాల వెల్లడి మార్కెట్‌లో ఒడుదొడుకులకు దారితీసింది. అనేక మంది పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్‌బిఐ, ఐటిసి, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌&టి ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి. ఎటర్నల్, టైటాన్, బీఈఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలను నమోదు చేశాయి. దేశీయ మూలధన మార్కెట్లు బలహీనంగా ఉండటంతో, రూపాయి మారకం విలువ 0.08 శాతం తగ్గి డాలర్‌తో పోలిస్తే 86.36 వద్ద ట్రేడ్ అవుతోంది.


More Telugu News