డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడని అబద్ధపు ఫిర్యాదు.. మహిళా టెక్కీపై కేసు

  • డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ వచ్చి అత్యాచారం చేశాడని పుణే టెక్కీ ఫిర్యాదు
  • విచారణలో అబద్ధపు ఫిర్యాదు అని గుర్తించిన పోలీసులు
  • ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని విచారణలో వెల్లడి
పుణేలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా టెక్కీ అబద్ధపు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపైనే కేసు నమోదు చేశారు. ఈ నెల 3న 22 ఏళ్ల వయస్సున్న ఆ టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన ఒక వ్యక్తి తన ఫ్లాట్‌లోకి చొరబడి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేశాడని తెలిపింది.

సదరు వ్యక్తి తన ఫొటోలు తీశాడని, ఈ విషయం బయటకు చెబితే సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు వివరించింది. తన ఆరోపణలకు మద్దతుగా కొన్ని సాక్ష్యాలను కూడా సమర్పించింది.

అయితే, పోలీసులు లోతుగా విచారణ జరిపిన తర్వాత ఆ మహిళా టెక్కీ అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలింది. డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితుడని గుర్తించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, కావాలనే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమె పైనే కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Pune Woman
Pune
Woman
Techie
False Complaint
Rape Allegation
Delivery Boy

More Telugu News