ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చిందన్న మంత్రి
  • తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్య‌
  • అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని వెల్ల‌డి
  • ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపాటు
గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

రాజ్యసభలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. "ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ప్ర‌మాదంపై ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేష‌న్ బ్యూరో) పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్యాప్తు జ‌రుపుతోంది. కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్‌ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం" అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


More Telugu News