అనూహ్యంగా టీమిండియాకు ఎంపికైన అన్షుల్ కాంభోజ్... మాటలు రావడంలేదన్న సోదరుడు!

  • టీమిండియాలో స్థానం సంపాదించిన హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్
  • అర్షదీప్, ఆకాశ్ దీప్ గాయపడడంతో కాంబోజ్ కు అవకాశం
  • సంతోషంతో ఉప్పొంగిపోతున్న కుటుంబం
హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో నాల్గవ టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టులో చేర్చారు. ఈ వార్తతో అన్షుల్ కుటుంబ సభ్యులు మరియు అతని కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ మరియు ఆకాశ్ దీప్‌లు గాయపడడంతో ముందు జాగ్రత్తగా అన్షుల్ కాంబోజ్ ను ఎంపిక చేశారు. అర్షదీప్, ఆకాశ్ దీప్ నాల్గవ టెస్టులో ఆడేది సందేహమే.

అన్షుల్ సోదరుడు సన్యమ్ కాంబోజ్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్షుల్ భారత జాతీయ జట్టుకు ఎంపికవడం పట్ల మొత్తం కుటుంబం  ఆనందిస్తోంది. అతని ఎంపికపై నా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. అతను అకాడమీలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడు, ఇంటికి కేవలం నిద్రించడానికి మాత్రమే వచ్చేవాడు" అని వెల్లడించారు. ఈ సంతోషకరమైన సందర్భంలో అన్షుల్ కాంబోజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అతను టీమ్ ఇండియాకు మరిన్ని విజయాలను అందిస్తాడని ఆశిస్తున్నామని సోదరుడు పేర్కొన్నారు. 

24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ వేగవంతమైన బౌలింగ్, ఎలాంటి పిచ్ పై అయినా బౌన్స్‌ రాబట్టడంలో దిట్ట. ఈ రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు ఇండియా-ఏ జట్టు తరపున రెండు అనధికారిక టెస్టుల్లో ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా, తన బ్యాటింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు, తనుష్ కోటియన్‌తో కలిసి 149 పరుగుల అజేయ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. 

గత ఏడాది రంజీ ట్రోఫీలో కేరళపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన అన్షుల్, రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు బెంగాల్‌కు చెందిన ప్రేమంగ్సు చటర్జీ (1956-57) మరియు రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సోమసుందరం (1985-86) మాత్రమే ఈ ఘనత సాధించారు.




More Telugu News