డబ్ల్యూసీఎల్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ రద్దు.. నిర్వాహకుల క్షమాపణలు

  • డబ్ల్యూసీఎల్‌లో నేడు భారత్-పాక్ మ్యాచ్
  • పహల్గామ్ దాడి నేపథ్యంలో మ్యాచ్‌పై విమర్శలు
  • పాక్‌తో ఆడేది లేదన్న భారత ఆటగాళ్లు
  • విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నిర్వాహకులు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భారత్-పాక్ మ్యాచ్‌ అధికారికంగా రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌ను తీవ్రంగా విమర్శించిన షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని జట్టుతో ఆడేది లేదని స్పిన్నర్ హర్భజన్‌సింగ్, ఓపెనర్ శిఖర్ ధవన్, సురేశ్ రైనా, ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ వంటివారు తెగేసి చెప్పడంతో మరో మార్గం లేని నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా క్షమాపణలు కూడా తెలిపారు.

డబ్ల్యూసీఎల్ సీజన్ 2 ఈ నెల 18న ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ పాకిస్థాన్ చాంపియన్స్-ఇంగ్లండ్ చాంపియన్స్ మధ్య జరిగింది. అయితే, ఈ సీజన్‌లో ఇవాళ జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగానే మ్యాచ్ నిర్వహిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు, ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు తెలిపారు.


More Telugu News