వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతిస్తోంది: సాదినేని యామిని శర్మ

  • మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు
  • ఆయ‌న అరెస్టును బీజేపీ స్వాగతిస్తుంద‌న్న‌ ఏపీ బీజేపీ ప్రతినిధి యామిని శ‌ర్మ‌ 
  • మిథున్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద లిక్క‌ర్ స్కాంలో భాగ‌మ‌య్యార‌ని వ్యాఖ్య‌
  • ఇది రాజకీయ ప్రతీకార కేసు అన్న‌ వైసీపీ ఆరోపణను తోసిపుచ్చిన యామిని
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ మండలి సభ్యురాలు సాదినేని యామిని శర్మ అన్నారు.

"ఈ చర్య మన ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ నిబద్ధతను స్పష్టం చేస్తుంది" అని ఆమె అన్నారు. మిథున్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో భాగ‌మ‌య్యార‌ని, అక్కడ ఆయ‌న‌ ఎక్సైజ్ విధానాలను తారుమారు చేసి, మద్యం ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్‌మెంట్ వ్యవస్థను మార్చార‌ని యామిని శర్మ ఆరోపించారు.

"కొంతమంది సరఫరాదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే చొరవలను కూడా ఆయన తీసుకున్నారు. వారి ద్వారా ఆయ‌న‌ కిక్‌బ్యాక్‌లు సేకరించి షెల్ కంపెనీల ద్వారా నిధులు సమకూర్చారు" అని ఏపీ బీజేపీ ప్రతినిధి అయిన యామిని అన్నారు.

ఇది రాజకీయ ప్రతీకార కేసు అని వైసీపీ చేసిన ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. "వేలాది మంది అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసిన మద్యం కుంభకోణంలో భాగ‌మైన‌ వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అతి త్వరలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న‌ మిగిలిన వ్యక్తులు, చాలా మంది మరణానికి కారణమైన వారు జైలులో ఉంటారు. మేము ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాము" అని ఆమె తెలిపారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శనివారం విజయవాడ సిట్‌ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత అరెస్టు చేసింది. కాగా, ఏపీ లిక్క‌ర్ స్కాంలో ఆయ‌న నాలుగో (ఏ4) నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆయ‌న‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఒక రోజు తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. అంతకుముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయ‌న ముంద‌స్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. 2019-24లో అమలు చేసిన మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు సిట్ గుర్తించింది.

ఈ కేసులో సిట్‌ ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసిన కొన్ని గంటల తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో పాటు ఏసీబీ కోర్టులో 300 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.


More Telugu News