Priyanka Chaturvedi: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు.. బీసీసీఐపై మండిపడిన ఎంపీ ప్రియాంక చతుర్వేది

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీకి బీసీసీఐ అనుమతి ఇవ్వడాన్ని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది తప్పుబట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ తెంచుకుంది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీకి అనుమతించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని బీసీసీఐకి ఆమె గుర్తు చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన నిందితులను పాకిస్థాన్ పట్టుకోకముందే ఆ దేశంతో మ్యాచ్‌లు ఆడటం సరికాదని అన్నారు. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు శోకసముద్రంలో మునిగాయని అన్నారు. బీసీసీఐ, ఐసీసీలు డబ్బు గురించి ఆలోచించడం వారి నైతికతను ప్రశ్నిస్తోందని అన్నారు. ఈ మేరకు మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పోస్టర్‌ను ప్రియాంక సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Priyanka Chaturvedi
BCCI
Pakistan
World Championship of Legends
Pahalgam Terrorist Attack

More Telugu News