రష్యా మహిళను కలిసేందుకు ప్రియుడు ప్రయత్నం .. అంగీకరించని అధికారులు

  • తుమకూరు సంరక్షణ కేంద్రం వద్దకు వచ్చిన ప్రియుడు డ్రోర్ గోల్డ్ స్టినిన్ 
  • నీనా కుటినాను కలిసేందుకు అనుమతించని సంరక్షణ కేంద్రం అధికారులు
  • ఉన్నతాధికారులు అనుమతితో మళ్లీ వస్తానని తిరిగి బెంగళూరు వెళ్లిన డ్రోర్
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని గుహలో గుర్తించిన రష్యా మహిళ నీనా కుటినా (40), ఆమె పిల్లల కోసం ఇజ్రాయెల్ నుంచి ఆమె ప్రియుడుగా చెబుతున్న డ్రోర్ గోల్డ్ స్టినిన్ (38) నిన్న బెంగళూరుకు చేరుకున్న విషయం తెలిసిందే. నీనా కుటినా, ఆమె ఇద్దరు కుమార్తెలను తుమకూరు సమీపంలోని సంరక్షణ కేంద్రం (డిటెన్షన్ సెంటర్)లో అధికారులు ఉంచారు.

వారిని కలిసి మాట్లాడేందుకు డ్రోర్ గోల్డ్ స్టెనిన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫారినర్ డిటెన్షన్ సెంటర్ నిబంధనల మేరకు అధికారులు డ్రోర్‌ను వారిని కలిసేందుకు అనుమతించలేదు. దీంతో కిటికీలో నుంచి కనిపిస్తున్న ఆమెను సైగలతోనే డ్రోర్ పలకరించారు.

అనంతరం డ్రోర్ మాట్లాడుతూ.. తాను నీనాతో తొమ్మిదేళ్లుగా సహజీవనం చేశానని, నీనా, పిల్లలతో దిగిన పలు ఫోటోలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. పిల్లలను చదివించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, వారి కోసం ఎన్నో బహుమతులు, దుస్తులు తీసుకొచ్చానని, వాటిని ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే, వారు ఉంటున్న కేంద్రం లోపలికి వెళ్లి మాట్లాడేందుకు అధికారులు తనను అనుమతించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆమెతో మాట్లాడేందుకు వీలుకాదని అక్కడి సిబ్బంది చెప్పారని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మళ్లీ వస్తానని ఆయన తెలిపారు. అనంతరం ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లారు. 


More Telugu News