61 ఏళ్ల అరుదైన రికార్డుపై కన్నేసిన రిషబ్ పంత్

  • ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న‌ పంత్ 
  • మూడు టెస్టుల్లో 425 ప‌రుగులు బాదిన వైనం
  • ఒక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన వికెట్ కీప‌ర్‌గా బుధి కుందేరన్ (525) 
  • 1964లో జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో కుందెరన్ ఈ రికార్డు
  • పంత్ మ‌రో 101 ర‌న్స్ చేస్తే, 61 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. 27 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, హెడింగ్లీలో జరిగిన టెస్టులో ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రెండు సెంచరీలు (134, 118) నమోదు చేశాడు. ఆ సెంచరీల తర్వాత పంత్ తదుపరి నాలుగు ఇన్నింగ్స్‌లలో 25, 65, 74, 9 స్కోర్లు నమోదు చేశాడు. ఇలా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 425 పరుగులు బాదాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది పంతే.

పంత్‌కు అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశం
ఈ క్ర‌మంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అత్యధిక పరుగులు చేసిన 61 ఏళ్ల రికార్డును పంత్  బద్దలు కొట్టే అవకాశం ఉంది. భార‌త మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ బుధి కుందేరన్ 10 ఇన్నింగ్స్‌లలో 525 పరుగులతో ప్ర‌స్తుతం అత్య‌ధిక‌ రికార్డును కలిగి ఉన్నాడు. 1964లో జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో బుధి కుందెరన్ ఐదు మ్యాచ్‌లు ఆడి ఈ రికార్డును నమోదు చేశాడు. పంత్ మ‌రో 101 ర‌న్స్ చేస్తే, 61 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌ల‌వుతుంది. 

అలాగే 1966-67లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెనిస్ లిండ్సే ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీప‌ర్‌గా రికార్డును కలిగి ఉన్నాడు. ఐదు మ్యాచ్‌లలో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో అతను 606 పరుగులు చేశాడు. ప్రస్తుతం 425 పరుగులు చేసిన పంత్ ఆ రికార్డును అధిగమించడానికి ఇంకా 182 పరుగులు చేయాలి.


More Telugu News