సింగపూర్ లో భారత సంతతి మాజీ పోలీసుకు పదేళ్ల జైలు శిక్ష... ఎందుకంటే...!

  • పనిమనిషిని చిత్రవధ చేసి మరణానికి కారకుడైన మాజీ పోలీసు అధికారి
  • మరణించే సమయంలో కేవలం 24 కిలోల బరువు మాత్రమే ఉన్న పనిమనిషి
  • దర్యాప్తును తప్పుదారి పట్టించే యత్నం చేసిన మాజీ పోలీసు
మయన్మార్‌కు చెందిన 24 ఏళ్ల పనిమనిషి పియాంగ్ న్గైహ్ డాన్‌ను దారుణంగా చిత్రహింసలకు గురిచేసి, ఆమె మరణానికి కారణమైన కేసులో సింగపూర్ మాజీ పోలీసు అధికారికి శిక్ష పడింది. సింగపూర్‌లోని ఒక కోర్టు 46 ఏళ్ల భారత సంతతి మాజీ పోలీసు అధికారి కెవిన్ చెల్వమ్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

కెవిన్ చెల్వమ్‌పై నాలుగు ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయి. అవి... హాని కలిగించడం, ఆకలితో తీవ్ర గాయాలకు గురిచేయడంలో సహకరించడం, పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మరియు ఆధారాలను ధ్వంసం చేయడం.

2016 జులై 26న పియాంగ్ న్గైహ్ డాన్ మరణించింది. ఆమె మృతికి కారణం మెదడు గాయాలు, శరీరంపై పదేపదే జరిగిన హింసాత్మక దాడులని నిర్ధారించారు. మరణించే సమయానికి ఆమె తీవ్ర పోషకాహార లోపంతో కేవలం 24 కిలోల బరువు మాత్రమే ఉంది. చెల్వమ్ ఆమె యజమాని అయినప్పటికీ, అతని మాజీ భార్య గాయత్రి మురుగన్, అతని అత్త ప్రేమా ఎస్. నారాయణస్వామి కలిసి అనేక నెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు చానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.

ఈ దారుణ ఘటనకు సంబంధించి, గాయత్రి మురుగన్‌కు 2021లో 30 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ప్రేమా ఎస్. నారాయణస్వామికి 2023లో 17 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 


More Telugu News