లార్డ్స్ లో హైడ్రామా... ఇంగ్లండ్ ఓపెనర్ కు వేలు చూపించిన గిల్!

  • లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్
  • మూడో రోజు చివరి సెషన్ లో ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీ టైమ్ వేస్ట్ ఎత్తుగడలు!
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీమిండియా ఆటగాళ్లు 
  • నోటికి పనిచెప్పిన కెప్టెన్ గిల్
  • మైదానంలో ఉద్రిక్తత
లార్డ్స్‌లో భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మూడో రోజు చివరి సెషన్ లో ఉత్కంఠ భరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ మధ్య వాగ్వాదం జరిగింది, ఇది మైదానంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. రోజు ఆట ముగిసే సమయంలో, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై దూకుడుగా బౌలింగ్ చేశాడు. అయితే, క్రాలీ ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృథా చేస్తున్నాడని బుమ్రా గుర్తించాడు. దీంతో భారత ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

క్రాలీ... బుమ్రా బంతిని ఎదుర్కొనే ముందు రెండుసార్లు క్రీజు నుంచి పక్కకి రావడం, ఐదవ బంతికి చేతికి గాయమైందని ఫిజియోను పిలవడం వంటి చర్యలు భారత జట్టును మరింత రెచ్చగొట్టాయి. ఇవి టైమ్ వేస్ట్  చేసే చర్యలేనని టీమిండియా ఆటగాళ్లు మండిపడ్డారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్, స్లిప్స్‌లో ఉంటూ, క్రాలీపై కోపంతో అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించాడు. ఓ దశలో వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదంలో ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా జోక్యం చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఈ సంఘటనకు సంబంధించి ఇరు జట్ల నుండి విభిన్న స్పందనలు వచ్చాయి. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, క్రాలీ చర్యలను 'డ్రామా'గా అభివర్ణించాడు, అయితే ఓపెనర్‌గా క్రాలీ ఉద్దేశాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పాడు. మరోవైపు, ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్ టిమ్ సౌథీ, భారత జట్టు కూడా గతంలో సమయాన్ని వృథా చేసిందని, గిల్ ఒక సందర్భంలో మైదానంలో మసాజ్ తీసుకున్నాడని ఎద్దేవా చేశాడు. ఈ వివాదం ఇరు జట్ల మధ్య ఆటను మరింత రసవత్తరంగా మార్చింది.



More Telugu News