కోట, నేను ఒకే సినిమాతో కెరీర్ తో ఆరంభించాం: చిరంజీవి

  • నట దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూత
  • టాలీవుడ్ లో తీవ్ర విషాదం
  • ప్రగాఢ సంతాపం తెలియజేసిన చిరంజీవి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాస రావు (83) జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ వార్త తెలుగు సినీ ప్రేక్షకులను మరియు పరిశ్రమలోని పలువురు సెలెబ్రిటీలను ఆవేదనలో ముంచెత్తింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఓ భావోద్వేగపూరిత ట్వీట్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

"లెజెండరీ యాక్టర్, బహుముఖ  ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రంతో ఆయన, నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. 

రీసెంట్ గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో  కుంగదీసింది. కోట శ్రీనివాసరావు లాంటి  నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 


More Telugu News