లైవ్‌లో ఉగ్రవాదిని సమర్థించిన పాక్ మాజీ మంత్రి హీనా రబ్బానీ.. పరువు తీసిన జర్నలిస్ట్!

  • ఉగ్రవాదిని సమర్థించి ఇబ్బందుల్లో పడ్డ పాక్ మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్
  • అల్ జజీరా ఇంటర్వ్యూలో ప్రత్యక్ష ప్రసారంలో పరాభవం
  • ఉగ్రవాదిని సాధారణ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం
  • జాతీయ ఐడీ కార్డుతో లైవ్‌లోనే నిజం బయటపెట్టిన జర్నలిస్ట్
  • అమెరికా ప్రకటించిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అని రుజువు
  • సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పాక్ నేత
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఒక అంతర్జాతీయ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయారు. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని సాధారణ పౌరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, సదరు జర్నలిస్ట్ ఆధారాలతో సహా ఆమె వాదనను తోసిపుచ్చడంతో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

ఇటీవల అల్ జజీరా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ హాజరయ్యాడు. ఈ విషయంపై హీనా మాట్లాడుతూ, "మీరు ఉగ్రవాది అని చెబుతున్న వ్యక్తి అతను కాదు. పాకిస్థాన్‌లో లక్షల మంది అబ్దుల్ రవూఫ్‌లు ఉంటారు" అని సమర్థించుకున్నారు.

హీనా వాదనపై వెంటనే స్పందించిన జర్నలిస్ట్ ఆమెను అక్కడికక్కడే ఇరుకునపెట్టారు. అంత్యక్రియల్లో కనిపించిన వ్యక్తికి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని, అతని జాతీయ గుర్తింపు కార్డు (నేషనల్ ఐడీ) నంబర్‌ను కూడా పాక్ వర్గాలు విడుదల చేశాయని గుర్తుచేశారు. ఆ ఐడీ నంబర్, అమెరికా ఉగ్రవాదుల జాబితాలో పేర్కొన్న అబ్దుల్ రవూఫ్ ఐడీ నంబర్ ఒకటేనని జర్నలిస్ట్ స్పష్టం చేయడంతో హీనా ఖంగుతిన్నారు.

ఈ అనూహ్య పరిణామంతో అవాక్కయిన హీనా రబ్బానీ, సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. పాక్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ కూడా ఆ ఫొటోలోని వ్యక్తి ఉగ్రవాది కాదని, అతను ఒక రాజకీయ నేత అని చెప్పిందని ఆమె వాదించారు. అయినప్పటికీ, రెండు ఐడీ నంబర్లు ఒకటేనన్న తిరుగులేని ఆధారాలతో ఆమె వాదన నిలవలేదు.


More Telugu News