Germany: ఎర్ర సముద్రంలో లేజర్ దాడి... చైనాపై జర్మనీ ఆరోపణలు

ఎర్ర సముద్రంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తమ నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధనౌక లేజర్‌తో లక్ష్యంగా చేసుకుందని జర్మనీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జర్మనీ, తమ దేశంలోని చైనా రాయబారిని పిలిపించి వివరణ కోరింది. ఈ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో ఈ ఘటన జరిగింది. హూతీ తిరుగుబాటుదారుల దాడుల నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్వహిస్తున్న ‘ఆస్పైడ్స్’ మిషన్‌లో భాగంగా జర్మనీ విమానం గస్తీ కాస్తోంది. ఈ సమయంలో చైనా యుద్ధనౌక ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తమ విమానంపైకి లేజర్‌ను ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు, ముందు జాగ్రత్త చర్యగా మిషన్‌ను అర్థాంతరంగా నిలిపివేసి జిబౌటీలోని స్థావరానికి విమానాన్ని సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ ఘటనలో విమాన సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

"చైనా చర్య సిబ్బంది భద్రతకు, మిషన్ కార్యకలాపాలకు ప్రమాదం కలిగించేలా ఉంది. లేజర్‌ను ఉపయోగించడం ద్వారా, చైనా యుద్ధనౌక మా సిబ్బందికి, విమానానికి ప్రమాదం తలపెట్టేందుకే సిద్ధపడింది" అని జర్మనీ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆస్పైడ్స్ మిషన్ కేవలం వాణిజ్య నౌకల రక్షణకు మాత్రమే పరిమితమని, సైనిక దాడుల్లో పాల్గొనదని ఈయూ స్పష్టం చేస్తోంది.

మరోవైపు, జర్మనీ చేసిన తీవ్ర ఆరోపణలపై చైనా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. హూతీల దాడులతో ఇప్పటికే అట్టుడుకుతున్న ఎర్ర సముద్రంలో ఈ తాజా పరిణామం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
Germany
Red Sea
China
laser attack
German surveillance plane
Houthi rebels
Aspides mission
Djibouti
European Union

More Telugu News