గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి నాపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు: అనిత

  • టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ వ్యాఖ్యల దుమారం
  • వైసీపీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతి ఉందంటూ విమర్శ
  • గతంలో తనపైనా ప్రసన్నకుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వెల్లడి
టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ప్రసన్న కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైసీపీ అధినేత జగన్‌కు ఆమె సూచించారు. మహిళలను అగౌరవపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో భాగంగా ఆమె ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "మహిళా ఎమ్మెల్యేలను మరింత గౌరవించాల్సింది పోయి, ఇలా అనుచితంగా మాట్లాడటం దుర్మార్గం. దమ్ముంటే ఆ వ్యాఖ్యల వీడియోను తన తల్లికి, భార్యకు, బిడ్డకు చూపించాలి" అని ప్రసన్న కుమార్‌కు అనిత సవాల్ విసిరారు. గతంలో తనపై కూడా ప్రసన్న కుమార్ ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడారని ఆమె గుర్తుచేశారు.

వైసీపీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతి ఉందని, సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు అనేక మంది నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆమె విమర్శించారు. "సొంత తల్లిని, చెల్లిని గౌరవించని జగన్‌కు రాజకీయ విలువలు ముఖ్యమా? ఈ తరహా వ్యాఖ్యల వల్లే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో శాంతిభద్రతలను గాలికొదిలేశారని, ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీస్ శాఖలో మార్పులు తెస్తున్నామని అనిత తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారి ఆస్తులను సైతం జప్తు చేస్తున్నామని వెల్లడించారు. 


More Telugu News

Vangalapudi Anita Prasanna Kumar Reddy TDP MLA Prasanthi Reddy YS Jagan Andhra Pradesh Politics Women in Politics Sajjala Ramakrishna Reddy Bobbili Vizianagaram district Ganja cases