Bharat Bandh: రేపు భారత్ బంద్.. రోడ్డెక్కనున్న 25 కోట్ల మంది కార్మికులు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ 'భారత్ బంద్' లో సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, దేశ వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్, బీమా, పోస్టల్, బొగ్గు గనులు, రవాణా వంటి కీలక ప్రభుత్వ రంగ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఈ నిరసనలో పాల్గొనేలా నెలల తరబడి సన్నాహాలు చేసినట్టు కార్మిక సంఘాల నేతలు వివరించారు. 25 కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నేత అమర్జీత్ కౌర్ స్పష్టం చేశారు.

గతేడాది కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు సమర్పించిన 17 డిమాండ్ల పత్రాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. గడిచిన పదేళ్లుగా కనీసం వార్షిక కార్మిక సదస్సును కూడా నిర్వహించకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమని విమర్శించాయి. పార్లమెంటు ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, సామూహిక బేరసారాలను దెబ్బతీసి, యూనియన్ల కార్యకలాపాలను అణచివేసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు తెలిపాయి. కార్మికుల సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పూర్తి మద్దతు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి.
Bharat Bandh
Workers Strike
Trade Unions
Mansukh Mandaviya
AITUC
Harbhajan Singh Sidhu
Amarjeet Kaur
Labour Codes
Privatization

More Telugu News