ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడితో మాకు సంబంధం లేదు: టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

  • కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై దాడి
  • ఫర్నీచర్, కార్లను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
  • ప్రసన్న వల్ల బాధలు అనుభవించిన వారే దాడి చేసి ఉండొచ్చన్న ప్రశాంతిరెడ్డి
కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. దాడులు చేసే సంస్కృతి తమది కాదని, ప్రసన్నకుమార్‌ రెడ్డి వల్ల గతంలో ఎంతోమంది తీవ్రమైన బాధలు అనుభవించారని, వారిలో ఎవరో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తనపై వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రసన్నకుమార్‌ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నీచర్‌తో పాటు పలు కార్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ, తనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రసన్నకుమార్‌ రెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమ ఇంట్లోని మహిళలకు చూపించగలరా అని ఆమె ప్రశ్నించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్‌ తీవ్రంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.



More Telugu News