కర్ణాటకలో అమానుషం.. తల్లికి దెయ్యం పట్టిందని కొడుకు పైశాచికత్వం

  • మూఢనమ్మకంతో దారుణ హత్య
  • దెయ్యం పట్టిందన్న అనుమానంతో తల్లిని కొట్టించిన కొడుకు
  • భూతవైద్యం పేరుతో మహిళపై గంటల తరబడి కర్రలతో దాడి
  • తీవ్ర గాయాలతో 55 ఏళ్ల గీతమ్మ మృతి
  • కొడుకు సంజయ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
మూఢనమ్మకం కన్నతల్లి ప్రాణాలను బలిగొంది. ఆమెకు దెయ్యం పట్టిందన్న అనుమానంతో కన్నకొడుకే కొందరితో కలిసి ఆమెను కర్రలతో కొట్టి చంపించిన అమానవీయ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే... గీతమ్మ (55) ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమెకు దెయ్యం పట్టిందని ఆమె కొడుకు సంజయ్ బలంగా నమ్మాడు. ఈ క్రమంలో భూతవైద్యం చేస్తానని చెప్పిన ఆశ అనే మహిళను, ఆమె భర్త సంతోశ్‌ను సంప్రదించాడు. సోమవారం రాత్రి గీతమ్మ ఇంటికి వచ్చిన ఆశ, సంతోశ్‌ దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు.

ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో అర్ధ స్పృహలో ఉన్న గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టడం, జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి. రాత్రి 9:30 గంటలకు మొదలైన ఈ దాడి తెల్లవారుజామున 1:00 గంట వరకు కొనసాగింది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గీతమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గీతమ్మ కొడుకు సంజయ్‌తో పాటు భూతవైద్యం పేరుతో దాడికి పాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోశ్‌ను అరెస్ట్ చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News