అమెరికాలో ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవదహనం

  • హైదరాబాద్‌కు చెందిన కుటుంబం దుర్మరణం
  • దంపతులు, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి
  • కారును ట్రక్కు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
  • కారులోనే సజీవదహనమైన కుటుంబం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం అగ్నికి ఆహుతైంది. ఈ హృదయ విదారక ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. విహారయాత్ర కోసం వెళ్లిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

హైదరాబాద్‌కు చెందిన వెంకట్, తేజస్విని దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవలే విహారయాత్ర కోసం అమెరికా వెళ్లారు. డాలస్ నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి డాలస్ కు కారులో వస్తుండగా గ్రీన్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఒక మినీ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టడంతో, వెంకట్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో నలుగురూ కారులోనే సజీవదహనమై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి బంధువులు, హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


More Telugu News