తిరుపతిలో ఉన్మాది దాడి... ఒకరు మృతి

పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఓ ఉన్మాది నడిరోడ్డుపై కత్తి, కర్రతో బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలతీర్థం రోడ్డులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా చేతిలో కత్తి, కర్ర పట్టుకుని దారిన వెళ్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో శేఖర్ (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యం, కల్పన అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

దాదాపు గంటపాటు శ్రమించిన అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


More Telugu News