రెండో టెస్టు గెలిచాక డబ్ల్యూటీసీ టేబుల్ లో టీమిండియా స్థానం ఇదే!

  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరిన టీమిండియా
  • ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానం
  • రెండు, మూడు స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లండ్
 ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చరిత్రాత్మక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుండి నడిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీ బాది జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో యువ పేసర్ ఆకాశ్ దీప్ అద్భుతం చేశాడు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లతో రాణించాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. "ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్ అమోఘం" అని గిల్ కొనియాడాడు. ఫీల్డింగ్, బౌలింగ్‌లో జట్టు ఎంతో మెరుగుపడిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక, ఇంగ్లండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తాజా విజయంతో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.


More Telugu News