Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు? ఒక్కటైన రాజ్, ఉద్ధవ్ థాకరే!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న థాకరే సోదరులు.. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే శనివారం ఒక్కటయ్యారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం ముంబైలోని వర్లీ డోమ్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో వారు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ అనూహ్య కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ రాజ్, ఉద్ధవ్ వర్గాలు కలిసి పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విజయాన్ని ‘మరాఠీ ఐక్యత విజయం’గా అభివర్ణిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు వర్లీ డోమ్‌లో భారీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరాఠీ రచయితలు, కవులు, విద్యావేత్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 7,000 నుంచి 8,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ ప్రాంగణంలో లోపల, బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ సభకు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్, కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ హాజరు కాలేదు. ఎంఎన్ఎస్ వర్గాలు వారిని ఆహ్వానించినప్పటికీ, వారు దూరంగా ఉన్నారు. 

థాకరే సోదరుల కలయికపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది మరాఠీ భాషాభిమానం కాదని, త్వరలో జరగనున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజకీయంగా నిలదొక్కుకోవడానికేనని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే విమర్శించారు. ఉద్ధవ్ నేతృత్వంలో బీఎంసీ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ మంది మరాఠీలు ముంబైని విడిచి వెళ్లారని షిండే వర్గం నేత రామ్‌దాస్ కదమ్ ఆరోపించారు.

ప్రస్తుతం రాజకీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు సోదరుల కలయిక, భవిష్యత్తులో వారి మధ్య రాజకీయ పొత్తుకు దారితీస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ వారి రాజకీయ భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Uddhav Thackeray
Raj Thackeray
Maharashtra politics
Shiv Sena UBT
MNS
Marathi language
Brihanmumbai Municipal Corporation
BMC elections
Maharashtra Navnirman Sena
Thackeray brothers

More Telugu News