ఢిల్లీలో జంట హత్యల కలకలం.. ఫ్లాట్‌లో హత్యకు గురైన తల్లీకుమారుడు

  • ఢిల్లీ లజ్‌పత్ నగర్‌లో జంట హత్యల కలకలం
  • భార్య, కొడుకు ఫోన్‌కు స్పందించకపోవడంతో భర్త అనుమానం
  • ఇంటి మెట్ల వద్ద రక్తపు మరకలు చూసి పోలీసులకు ఫోన్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. లజ్‌పత్ నగర్ పార్ట్-1లో తల్లి, కుమారుడు వారి నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. మృతులను రుచికా సేవాని (42), ఆమె కుమారుడు క్రిష్ (14)గా గుర్తించారు. గత రాత్రి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

రుచికా భర్త కుల్దీప్ సేవాని తన భార్యకు, కొడుక్కి పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానంతో రాత్రి ఇంటికి చేరుకున్న ఆయనకు అపార్ట్‌మెంట్ మెట్లపైన, ప్రవేశ ద్వారం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే రాత్రి 9:43 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. బెడ్‌రూమ్‌లో రుచికా సేవాని మృతదేహం పడి ఉండగా, వాష్‌రూమ్‌లో ఆమె కుమారుడు క్రిష్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. ఇద్దరి శరీరాలపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయని, అత్యంత దారుణంగా వారిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


More Telugu News