Srigandham Smuggling: చేవెళ్లలో 'పుష్ప' సీన్ రిపీట్... డీసీఎంలో భారీగా గంధం చెక్కల స్మగ్లింగ్

Srigandham Smuggling Pushpa Scene Repeated in Chevella
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లాలో భారీగా శ్రీగంధం చెక్కల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. 'పుష్ప' సినిమా తరహాలో డీసీఎం వాహనంలో రహస్యంగా తరలిస్తున్న సుమారు వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మాదాపూర్ ఎస్‌వోటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

డీసీఎంలో రహస్యంగా తరలింపు

చేవెళ్ల మండలంలోని బస్తేపూర్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎంను ఆపి సోదా చేయగా అసలు విషయం బయటపడింది. వాహనం లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో శ్రీగంధం చెక్కలను దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ చెక్కలను మహారాష్ట్ర నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం నాగర్‌గూడలో ఉన్న ఒక పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని చేవెళ్ల ఏసీపీ కిషన్ మీడియాకు వివరించారు. స్వాధీనం చేసుకున్న శ్రీగంధం చెక్కల విలువ మార్కెట్లో సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని ఆయన అంచనా వేశారు.

ముగ్గురు అరెస్ట్.. ఇద్దరు పరారీ

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్‌వైజర్ సోహెబ్, రైతు విజయ్ హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ స్మగ్లింగ్ వెనుక కీలక సూత్రధారులుగా భావిస్తున్న పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్ధిఖ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Srigandham Smuggling
Rangareddy district
Chevela
Pushpa movie
Sandalwood smuggling

More Telugu News