రేఖా గుప్తా ఇంటికి కొత్త హంగులు.. రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు

గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం 'షీష్‌మహల్'పై తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా, ఇప్పుడు తన అధికారిక నివాసం కోసం భారీగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె నివాసం ఉండబోయే రాజ్ నివాస్ మార్గ్ లోని ఒకటో నంబర్ బంగ్లా నవీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 60 లక్షలు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) టెండర్ నోటీసు జారీ చేసింది.

టెండర్‌లో ఖర్చుల వివరాలు ఇలా..
పీడబ్ల్యూడీ జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం ఈ నిధులను ప్రధానంగా ఎలక్ట్రికల్ పనుల ఆధునికీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో భాగంగా రూ. 9.3 లక్షలతో ఐదు టీవీలు, రూ. 7.7 లక్షలతో 14 ఏసీలు, రూ. 5.74 లక్షలతో 14 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు రూ. 2 లక్షలతో నిరంతర విద్యుత్ సరఫరా కోసం యూపీఎస్ వ్యవస్థను కూడా అమర్చనున్నారు.

ఇవే కాకుండా రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే 23 సీలింగ్ ఫ్యాన్ల కోసం రూ. 1.8 లక్షలు, ఒక ఓవెన్ టోస్ట్ గ్రిల్ (ఓటీజీ) కోసం రూ. 85,000, ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కోసం రూ. 77,000, డిష్‌వాషర్ కోసం రూ. 60,000, గ్యాస్ స్టవ్ కోసం రూ. 63,000, మైక్రోవేవ్‌ల కోసం రూ. 32,000, ఆరు గీజర్ల కోసం రూ. 91,000 ఖర్చు చేయనున్నట్లు టెండర్‌లో వివరించారు. అదనంగా రూ. 6 లక్షలకు పైగా ఖర్చుతో 115 దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

రెండు బంగ్లాల కేటాయింపు
ప్రభుత్వం సీఎం రేఖా గుప్తాకు ఒకటి, రెండు నంబర్ల బంగ్లాలను కేటాయించింది. రాజ్ నివాస్ మార్గ్‌లోని ఒకటో నంబర్ బంగ్లాను ఆమె నివాసం కోసం, రెండో నంబర్ బంగ్లాను క్యాంపు కార్యాలయం కోసం వినియోగించనున్నారు. ఈ నెల 4న టెండర్ల బిడ్లు తెరుస్తామని, 60 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రేఖా గుప్తా తన సొంత నివాసమైన షాలిమార్ బాగ్‌లోనే ఉంటున్నారు.

ఫిబ్రవరిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేజ్రీవాల్ నివాసం ఉన్న 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని వివాదాస్పద బంగ్లాలో తాను నివసించనని రేఖా గుప్తా స్పష్టం చేశారు. బీజేపీ 'షీష్‌మహల్' అని పిలిచిన ఆ బంగ్లాను మ్యూజియంగా మారుస్తామని ఆమె ప్రకటించారు. 

"మేం షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు" అని ఆమె ఆనాడు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ తన అధికారిక నివాసంపై భారీగా ఖర్చు చేశారని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఆ బంగ్లాను ఖాళీ చేశారు.

Rekha Gupta
Delhi CM
Raj Niwas Marg
Sheesh Mahal
Arvind Kejriwal
Delhi Government
PWD
MLA Bungalow
modernization
renovation

More Telugu News