జాతీయ క్రీడల విజేతలకు ఏపీ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాలు

రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఏపీలోని కూట‌మి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు మొత్తం రూ.91.75 లక్షల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయ క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన 15 మంది ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఈ నగదు బహుమతి అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) సంయుక్తంగా ఈ నిధులను మంజూరు చేశాయి. క్రీడాకారులలో స్ఫూర్తిని నింపడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తోంది. తాజాగా ప్రకటించిన ఈ నజరానాతో క్రీడాకారుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

AP Govt
National Games
AP Sports
Uttarakhand National Games
Sports Authority of Andhra Pradesh
SAP Andhra Pradesh
AP Sports Incentives
Indian Sports
AP sports awards
Sports news

More Telugu News