ఆటో, ఫైనాన్స్ షేర్లపై ఒత్తిడి... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఫైనాన్షియల్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి
  • 452 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 120 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించడం వంటి అనుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఫైనాన్షియల్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు నష్టపోవడంతో మార్కెట్లు కిందకు జారాయి.

ఈనాటి ట్రేడింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్‌గా 84,027 పాయింట్ల వద్ద మొదలైంది. రోజంతా నష్టాల్లోనే సాగిన సూచీ, ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి 452 పాయింట్ల నష్టంతో 83,606 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 120 పాయింట్లు కోల్పోయి 25,517 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటి జాబితాలో ఉన్నాయి. మరోవైపు, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి షేర్లు లాభాలను ఆర్జించాయి.

ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.74 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 67.58 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు ధర 3,299 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


More Telugu News