అమిత్ షా వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్

నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నిజామాబాద్ పర్యటనలో షా చేసిన ప్రకటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమో కానీ, నక్సలిజాన్ని మాత్రం అంతం చేయలేరని ఆయన అన్నారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలు మారనంత వరకు ఇలాంటి సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సలైట్లతో చర్చలు జరపబోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు తక్షణమే హింసను వీడి, ఆయుధాలు పక్కనపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. వారు ఆయుధాలు వీడేంత వరకు వారితో ఎలాంటి చర్చలు ఉండవని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన గుర్తుచేశారు. "గిరిజన బిడ్డలను, పోలీసులను నక్సలైట్లు చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం చర్చల కోసం చాలా మంది ముందుకొస్తున్నారు" అని కొందరి వైఖరిని దుయ్యబట్టారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సీపీఐ నారాయణ పైవిధంగా స్పందించారు.


More Telugu News