అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు.. వార్షిక వేతనం ఎంతంటే?

  • రిలయన్స్ ఈడీగా అనంత్ అంబానీకి రూ. 10-20 కోట్ల వేతనం
  • గ్రూప్ ఇంధన వ్యాపార బాధ్యతలు చూస్తున్న అనంత్
  • ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికలో భాగంగా నియామకం
  • గతంలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కేవలం ఫీజులు, కమీషన్
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ఈడీ) కొత్తగా బాధ్యతలు చేపట్టిన అనంత్ అంబానీ వార్షిక వేతనం భారీ మొత్తంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఏడాదికి రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య వేతనం ఉండవచ్చని కంపెనీ తన వాటాదారులకు పంపిన నోటీసులో పేర్కొంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్, ప్రస్తుతం సంస్థ ఇంధన వ్యాపారాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

వారసత్వ ప్రణాళికలో భాగంగా ముకేశ్ అంబానీ తన ముగ్గురు పిల్లలైన ఆకాశ్, ఈశా, అనంత్‌లను 2023లో ఆర్‌ఐఎల్ బోర్డులోకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ హోదాలో వారికి ఎలాంటి జీతం లేదు. కేవలం బోర్డు సమావేశాలకు హాజరైనందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఫీజులు, లాభాలపై కమీషన్ కింద రూ. 97 లక్షలు చెల్లించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో అనంత్ అంబానీని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ కొత్త నియామకంతో ఆయనకు జీతభత్యాలు అందనున్నాయి. ఇంధన వ్యాపారాలతో పాటు రిలయన్స్ గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించే రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా కూడా అనంత్ సేవలు అందిస్తున్నారు. అలాగే రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ బోర్డుల్లోనూ ఆయన సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతల నేపథ్యంలోనే ఆయన వేతనాన్ని భారీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.


More Telugu News