గుజరాత్ లో... జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శ్రుతి

  • అదుపుతప్పిన మూడు ఏనుగులు
  • భక్తులపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గందరగోళం
  • ప్రాణభయంతో పరుగులు తీసిన జనం
  • తోపులాటలో పలువురు భక్తులకు గాయాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఈ రోజు ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగమైన ఏనుగులు ఒక్కసారిగా అదుపుతప్పి జనంలోకి దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే... శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్‌లోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలో ఊరేగింపు ముందు భాగంలో ఉన్న మూడు ఏనుగులు హఠాత్తుగా బెదిరి భక్తుల సమూహంపైకి దూసుకొచ్చాయి. ఊహించని ఈ పరిణామంతో భయాందోళనకు గురైన భ‌క్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగి, కొందరు భక్తులు కిందపడి గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆలయ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే ఏనుగులను శాంతింపజేసి, జనసమూహాన్ని క్రమబద్ధీకరించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం రథయాత్రను తిరిగి కొనసాగించారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్ర సుమారు 16 కిలోమీటర్ల మేర సాగుతుంది. దీనిని వీక్షించేందుకు దాదాపు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరవ్యాప్తంగా 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ ఏడాది తొలిసారిగా ఆలయ పరిసరాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.


More Telugu News