పాత బంతితో ఇబ్బంది.. అంపైర్ల తీరుపై గిల్, సిరాజ్‌ల అసహనం

  • ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బంతి మార్పుకు టీమిండియా పలుమార్లు విన్నపం
  • బంతి మెరుపు తగ్గి, స్వింగ్ కావడం లేదని సిరాజ్ ఫిర్యాదు
  • అంపైర్లు రింగుతో తనిఖీ చేసి, మార్చేందుకు తొలుత నిరాకరణ
  • కెప్టెన్ గిల్, సిరాజ్, రాహుల్‌ల తీవ్ర అసహనం, ప్రేక్షకుల ఎగతాళి
  • చివరకు తర్వాతి ఓవర్లో కొత్త బంతిని ఇచ్చిన ఫీల్డ్ అంపైర్లు
ఇంగ్లాండ్‌తో జరిగిన మొద‌టి టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ఆట తొలి సెషన్‌లో బంతి మార్పు విషయమై టీమిండియా ఆటగాళ్లకు, ఫీల్డ్ అంపైర్లకు మధ్య కాసేపు చర్చ నడిచింది. భారత బౌలర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, అంపైర్లు తొలుత బంతిని మార్చేందుకు సుముఖత చూపలేదు.

ఆటలో 14వ ఓవర్ వేస్తున్న సమయంలో బంతి తన సహజమైన మెరుపును కోల్పోయిందని, సరిగ్గా స్వింగ్ కావడం లేదని మహమ్మద్ సిరాజ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే బంతిని మార్చాలని కోరాడు. అంపైర్లు బంతిని తీసుకుని, దాని ఆకృతిని రింగుతో పరీక్షించారు. అయితే, బంతి మార్చాల్సినంతగా దెబ్బతినలేదని నిర్ధారించి, అదే బంతితో ఆటను కొనసాగించాలని సూచించారు.

సిరాజ్ తన తర్వాతి ఓవర్లోనూ ఇదే సమస్యను లేవనెత్తాడు. బంతి పరిస్థితి బౌలింగ్‌కు అనుకూలంగా లేదని, దానిని మార్చాలని మరోసారి అంపైర్‌ను కోరాడు. అంపైర్ మళ్లీ బంతిని పరిశీలించి, మార్పునకు అంగీకరించలేదు. ఈ పరిణామంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సిరాజ్‌తో పాటు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా అంపైర్ల నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారు అంపైర్లతో తమ వాదనను వినిపించారు.

ఆట 22వ ఓవర్‌కు (శార్దూల్ ఠాకూర్ వేస్తున్న ఓవర్) చేరినప్పుడు, మధ్యలో టీమిండియా ఆటగాళ్లు మరోసారి బంతిని మార్చాలని అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా అంపైర్లు వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ సమయంలో స్టేడియంలోని ఇంగ్లాండ్ జట్టు అభిమానులు భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా అర‌వ‌డం మొదలుపెట్టారు.

అయితే, భారత ఆటగాళ్ల నిరంతర విజ్ఞప్తుల నేపథ్యంలో తర్వాతి ఓవర్ ఆరంభంలో అంపైర్లు ఎట్టకేలకు కొత్త బంతిని అందించారు. 


More Telugu News