పవన్ కల్యాణ్ పై తమిళనాడు మంత్రి ఆగ్రహం
- మధురై మురుగన్ భక్తుల సదస్సులో పవన్ ప్రసంగం
- మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతారన్న పవన్
- తమిళనాడుతో పవన్ కు ఏం సంబంధం అన్న మంత్రి శేఖర్ బాబు
- తమను ప్రశ్నించేందుకు ఆయన ఎవరని మండిపాటు
- బీజేపీ మాయలో పడొద్దని హితవు
మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొని ప్రసంగించారు. "మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు" అనే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ, ధర్మ మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. వీరవేల్ మురుగన్పై ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని తెలిపారు. 'ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం?' అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వంటి డీఎంకే నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకేని ఉద్దేశించి పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు మంత్రి శేఖర్ బాబు... పవన్ కల్యాణ్ కు అసలు తమిళనాడుతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. "మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాయలో పడి మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని పవన్కు హితవు పలికారు. తమ ప్రభుత్వం దేవదాయశాఖ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, పవన్ మాటలను నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.