హనీమూన్ హత్య కేసు: కీలక ఆధారాలు దాచిన ఫ్లాట్ ఓనర్ పరారీ!

  • రాజా రఘువంశీ హత్య కేసులో ఫ్లాట్ ఓనర్‌ లోకేంద్ర తోమర్‌పై మేఘాలయ సిట్ దృష్టి
  • సోనమ్ వదిలిన బ్యాగ్‌ను ఫ్లాట్ ఓనర్ తీసుకెళ్లాడని ప్రాపర్టీ డీలర్ ఆరోపణ
  • బ్యాగ్‌లో నాటు తుపాకీ, ఫోన్, నగలు, రూ.5 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం
  • ఇప్పటికే సాక్ష్యాలు ధ్వంసం చేసిన ప్రాపర్టీ డీలర్, సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్
  • లోకేంద్ర తోమర్ పరారీ, ఫోన్ స్విచ్ ఆఫ్, కొనసాగుతున్న గాలింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీ, ఆమె అనుచరులు ఇండోర్‌లోని ఒక ఫ్లాట్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్‌పై మేఘాలయ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి సారించింది. హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను లోకేంద్ర తోమర్ మాయం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సోనమ్ రఘువంశీ ఇండోర్‌లోని హీరాబాగ్ ప్రాంతంలో ఉన్న ఫ్లాట్ నుంచి వెళ్లేటప్పుడు ఒక బ్యాగ్‌ను అక్కడే వదిలేసింది. ఆ బ్యాగ్‌లో ఒక నాటు తుపాకీ, ఆమె ఫోన్, రాజాకు చెందిన కొన్ని నగలు, సుమారు ఐదు లక్షల రూపాయల నగదు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ బ్యాగ్‌ను ఫ్లాట్ యజమాని, ఒక నిర్మాణ రంగ సంస్థ అధినేత అయిన లోకేంద్ర తీసుకెళ్లాడని సిట్ అనుమానిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్‌ను విచారిస్తున్న సమయంలో లోకేంద్ర పేరు వెలుగులోకి వచ్చింది. హత్య నిందితులకు ఫ్లాట్‌ను అద్దెకు ఇప్పించింది ఈ సిలోమ్ జేమ్స్.

సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కాసేపటికి ఫ్లాట్ నుంచి ఆమె బ్యాగ్‌ను తీసేయమని లోకేంద్ర తనను అడిగాడని సిలోమ్ జేమ్స్ పోలీసులకు చెప్పాడు. అయితే, తాను తీయకపోవడంతో ఫ్లాట్ యజమానే స్వయంగా ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లాడని జేమ్స్ తెలిపాడు. అంతేకాకుండా, తన ఫ్లాట్ సమీపంలోని ఒక కారు షోరూమ్ సీసీటీవీ ఫుటేజ్‌ను సంపాదించడానికి కూడా తోమర్ ప్రయత్నించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం లోకేంద్ర తోమర్ పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిసింది. ఇండోర్‌లో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


More Telugu News