రేషన్ కార్డు కోసం లంచం: ఏసీబీ వలలో తహశీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్!

Chittemsetti Navakranth Caught Taking Bribe for Ration Card
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా, కొందరు ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే, బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టెంశెట్టి నవక్రాంత్, ఒక వ్యక్తి బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, కొత్త కార్డు జారీ కోసం ఉన్నతాధికారులకు పంపించేందుకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. ఈ పని చేసిపెట్టడానికి రూ.2,500 లంచం డిమాండ్ చేశాడు.

బాధితుడు ఈ విషయాన్ని తెలంగాణ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. వారి సూచన మేరకు, శనివారం నవక్రాంత్‌కు రూ. 2,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు నవక్రాంత్ తరచూ రేషన్ కార్డు దరఖాస్తుదారుల నుంచి డిజిటల్ చెల్లింపుల రూపంలో కూడా లంచాలు స్వీకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే, తక్షణమే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), అధికారిక వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Chittemsetti Navakranth
ration card
ACB
Bhadradri Kothagudem
Burghampahad

More Telugu News