విమాన ప్రమాదం తర్వాత ఫిల్మ్ డైరెక్టర్ మిస్సింగ్.. చనిపోయాడని తేల్చిన డీఎన్ఏ రిపోర్ట్

  • మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన వైద్యులు
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో విషాదం
  • గుజరాతీ ఫిల్మ్‌మేకర్ మహేశ్ జిరావాలా మృతి నిర్ధారణ
  • విమాన ప్రమాద స్థలంలో ఆనవాళ్లు, డీఎన్ఏతో స్పష్టత
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా మరణించాడని తాజాగా వైద్యులు ధ్రువీకరించారు. మహేశ్ కుటుంబ సభ్యుల డీఎన్ఏతో ఓ మృతదేహం డీఎన్ఏ సరిపోలడంతో మహేశ్ మృతిని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తర్వాత మహేశ్ కనిపించకుండా పోవడం, ప్రమాద స్థలంలో మహేశ్ స్కూటర్, మొబైల్ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. విమాన ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ నమూనాలు సేకరించగా.. మహేశ్ కుటుంబం కూడా శాంపుల్ ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది, నేలపై ఉన్న 29 మంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలానికి సమీపంలోని షాహీబాగ్‌లో కాలిపోయిన స్థితిలో ఒక యాక్టివా స్కూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అది నరోడా నివాసి అయిన మహేశ్ జిరావాలాకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆయన మొబైల్ ఫోన్ చివరిసారిగా క్రాష్ సైట్ సమీపంలోనే పనిచేసినట్లు ట్రేస్ అవ్వడంతో, ఆయన కూడా ప్రమాదంలో చిక్కుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మొదట్లో, ఈ ఆధారాలు లభించినప్పటికీ, మహేశ్ జిరావాలా కుటుంబ సభ్యులు ఈ వార్తను నమ్మలేదు. ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశతో ఎదురుచూశారు. అయితే, పోలీసులు అందించిన ఫోరెన్సిక్ నివేదికలు, ముఖ్యంగా మృతుడి డీఎన్ఏతో మహేశ్ డీఎన్ఏ సరిపోలడం, ఆయన స్కూటర్ ఛాసిస్ నంబర్ నిర్ధారణ కావడంతో, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో వాస్తవాన్ని అంగీకరించారు. అనంతరం, వారు మహేశ్ మృతదేహాన్ని స్వీకరించారు. ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలిసేందుకు మహేశ్ వెళ్లారని ఆయన భార్య హేతల్ తెలిపారు. మహేశ్ జిరావాలా పలు మ్యూజిక్ ఆల్బమ్‌లకు దర్శకత్వం వహించారు.


More Telugu News