యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం: సీఎం చంద్రబాబు
- రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్ట్రవ్యాప్త వేడుకలకు పిలుపు
- విశాఖ ఆర్కే బీచ్లో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు హాజరు
- యోగాతో శారీరక, మానసిక ఒత్తిడి దూరమవుతుందన్న చంద్రబాబు
- వాడవాడలా యోగా సాధనతో చరిత్ర సృష్టిద్దామని పిలుపు
యోగా – మన సంస్కృతి, మన ఆరోగ్యం
యోగా మన ప్రాచీన సంస్కృతిలో భాగమని, అది మనకు లభించిన అమూల్యమైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శారీరక, మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో యోగా పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. "యోగాను నిత్యం ఆచరిద్దాం. మన జీవన విధానంలో అంతర్భాగంగా మార్చుకుందాం. విశాఖ వేదికగా జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచే దీనికి నాంది పలుకుదాం" అని ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి అన్నారు. యోగా సాధన ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్ లో జరుగనున్న యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అలాగే రాష్ట్రంలో వాడవాడలా యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం" అని ఆయన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. వారసత్వంగా మనకు అందిన ఈ యోగా విద్యను మనమంతా ఆచరించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.