సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై గచ్చిబౌలిలో దాడి

Ramyasri Attacked Over Land Dispute in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో సీనియర్ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌పై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం, నిన్న ఎఫ్ సీఐ కాలనీ లేఅవుట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు ప్లాట్ యజమానుల సమక్షంలో రోడ్డు మార్కింగ్ పనులు చేపడుతుండగా ఈ వివాదం తలెత్తింది.

వివరాల్లోకి వెళితే, రమ్యశ్రీకి చెందిన ప్లాట్ వద్ద జరుగుతున్న రోడ్డు మార్కింగ్ ప్రక్రియను ఆమె, ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారు. ఈ సమయంలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావుకు చెందిన వారని ఆరోపిస్తున్న కొందరు వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. "మా స్థలంలో మేము వీడియో తీసుకుంటే మీకేంటి అభ్యంతరం?" అని రమ్యశ్రీ ప్రశ్నించడంతో వారు ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లు సమాచారం.

"పట్టపగలు, అదీ పోలీస్ స్టేషన్ ముందే మమ్మల్ని చంపడానికి దుండగులు ప్రయత్నించారు," అని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు క్రికెట్ బ్యాట్, కత్తితో తమపై దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో ప్రశాంత్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.

దాడి అనంతరం రమ్యశ్రీ, ప్రశాంత్ నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు, ఆయన అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన అనంతరం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వారి భద్రత నడుమ అధికారులు రోడ్ల మార్కింగ్ పనులను కొనసాగించారు. అయితే, ఈ గొడవ జరిగినప్పుడు అధికారులు అక్కడ లేరని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ మీడియాకు తెలిపారు. 
Go Back to Shorts
Ramyasri
Ramya Sri
Gachibowli
land dispute
Sandhya Convention
Hyderabad
attack
real estate
FCI layout
Prashanth

More Telugu News