కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికా బయలుదేరిన ట్రంప్

  • ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రరూపం దాల్చిన యుద్ధం
  • స్వదేశానికి చేరుకోగానే జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశానికి ట్రంప్ ఆదేశం
  • పశ్చిమాసియా పరిణామాలపై ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాలు ఒక దానిపై ఒకటి క్షిపణి దాడులకు దిగుతుండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. జీ7 సదస్సులో పాల్గొంటున్న ఆయన అక్కడి కార్యక్రమాలను కుదించుకుని అమెరికాకు తిరిగి వస్తున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ఈ విషయాలను వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధ్రువీకరించారు. జీ7 సదస్సులో అధ్యక్షుడు ట్రంప్ ఫలవంతమైన చర్చలు జరిపారని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని లీవిట్ తెలిపారు. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం దృష్ట్యా ఆయన తన పర్యటనను ముందుగానే ముగించుకుని అమెరికాకు బయల్దేరనున్నారని పేర్కొన్నారు. 

ట్రంప్ నిన్న సాయంత్రం జీ7 సభ్య దేశాల అధినేతలతో ట్రంప్ గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. అనంతరం, ‘నేను తక్షణమే తిరిగి వెళ్లాలి. ఇది చాలా ముఖ్యం’ అని తోటి నేతలకు ఆయన చెప్పినట్టు సమాచారం. ట్రంప్ నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సమర్థించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలని, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని జీ7 నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అమెరికాలో కీలక భేటీకి రంగం సిద్ధం
అమెరికాకు తిరిగి వచ్చిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసరంగా సమావేశం కానున్నారు. వైట్‌హౌస్‌లోని సిట్యుయేషన్ రూమ్‌లో సర్వసన్నద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


More Telugu News