ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. ఉద్రిక్తతలపై సైప్రస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన

Narendra Modi Concerned About Israel Iran Conflict Tensions in Cyprus
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలెడెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంతో పాటు యూరప్‌లో నెలకొన్న సంఘర్షణలు కూడా వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడమే మార్గమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ సాగించిన పోరాటానికి సైప్రస్ మద్దతు పలికినందుకు ఆ దేశ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలెడెస్ సాదర స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు సైప్రస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి సైప్రస్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3’ను అందించి గౌరవించింది.

ద్వైపాక్షిక సంబంధాలకు నూతనోత్తేజం

ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై వారు దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు.

"ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలనపై ఇరు దేశాలకు ఉన్న పరస్పర విశ్వాసమే మన సంబంధాలకు బలమైన పునాది" అని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సువర్ణావకాశమని ఆయన అభివర్ణించారు. సైప్రస్‌కు భారత్ అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశమని అన్నారు.

సైప్రస్‌కు శుభాకాంక్షలు

త్వరలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సైప్రస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సైప్రస్ నాయకత్వంలో ఈయూతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేందుకు సైప్రస్ తన వంతుగా ఈయూ సభ్యదేశాల మద్దతు కూడగడుతుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.

సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైనా ఇరు నేతలు చర్చించారు. సైప్రస్‌లో యోగా, ఆయుర్వేదాలకు ఆదరణ పెరుగుతుండటం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా భారత్‌లో పర్యటించాలని సైప్రస్ అధ్యక్షుడిని మోదీ ఆహ్వానించారు. భారతీయులకు సైప్రస్ ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉందని, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించే అంశంపై కూడా చర్చలు జరిగాయని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు.
Go Back to Shorts
Narendra Modi
Israel Iran conflict
Cyprus
Nikos Christodoulides
India Cyprus relations

More Telugu News