ఇజ్రాయెల్‌లో భారతీయుల భద్రతపై దౌత్య కార్యాలయం స్పందన

  • ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, గగనతలం మూసివేసిన ఇజ్రాయెల్ సర్కార్
  • భారతీయులందరూ సురక్షితమేనని పేర్కొన్న భారత ఎంబసీ
  • స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్న ఎంబసీ 
ఇజ్రాయెల్ – ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, అక్కడ ఉన్న భారత పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా మరోసారి స్పందించింది.

ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితంగానే ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.

ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ కుటుంబాలు, సంరక్షకులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులతో టెల్ అవీవ్‌లోని రాయబార కార్యాలయం నిరంతరం సంబంధాల్లో ఉందని తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

ఇజ్రాయెల్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, గగనతలం మూసివేసినందున, భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని, స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రమాణాలు పాటించాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 


More Telugu News