ఆసియాలోనే పొడవైన డబుల్ డెక్కర్‌గా విశాఖ మెట్రో!

Visakha Metro to be Asias Longest Double Decker Metro
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే 'డబుల్ డెక్కర్' విధానం. దీని ప్రకారం మెట్రో రైలు పైభాగంలో ప్రయాణిస్తుండగా, దాని కింద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా పైవంతెన నిర్మిస్తారు.

ఈ నూతన విధానంలో భాగంగా నగర నడిబొడ్డున నాలుగు వరుసల పైవంతెనలు రానున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో నాలుగు వరుసల పైవంతెనలు, మెట్రో లైనుకు కలిపి ఒకే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయడానికి అనువైన కన్సల్టెంట్ నియామకం కోసం ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) తాజాగా ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) ప్రతినిధులు ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపడం, వారు ఏపీఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డితో కలిసి విశాఖలో పర్యటించడం ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.

ఖర్చు.. సమయం.. స్థలం ఆదా
వాస్తవానికి నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గతంలో 12 పైవంతెనలు నిర్మించాలని ప్రణాళిక వేసింది. మధురవాడ నుంచి లంకెలపాలెం మధ్య వీటి నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. అయితే, ఇదే సమయంలో మెట్రో పనులు కూడా చేపడితే రెండు వేర్వేరు నిర్మాణాలతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ఖర్చు కూడా అధికమవుతుందని భావించారు. రెండు ప్రాజెక్టులను సంయుక్తంగా చేపట్టడం ద్వారా స్థలంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

ఇప్పటికే దేశంలోని నాగ్‌పూర్‌లో ఇలాంటి డబుల్ డెక్కర్ తరహా మెట్రో విజయవంతంగా నడుస్తోంది. ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ తయారుచేసిన సంస్థ నుంచి అవసరమైన వివరాలను సేకరించి, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ఏపీఎంఆర్‌సీ సమర్పించింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్, ఎన్‌హెచ్‌ఏఐ సంయుక్తంగా భరించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తం ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను ఏపీఎంఆర్‌సీ చేపట్టనుంది.

అత్యంత పొడవైన మెట్రో డబుల్ డెక్కర్
విశాఖ మెట్రో ప్రాజెక్టును మొత్తం 140.13 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో పనులు చేపట్టనున్నారు. ఈ మొదటి దశలో సుమారు 20.16 కిలోమీటర్ల మార్గాన్ని డబుల్ డెక్కర్ విధానంలో.. అంటే కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆపైన మెట్రో ట్రాక్‌ వచ్చేలా నిర్మిస్తారు. ముఖ్యంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, అలాగే గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ మధ్య ఈ రెండు భారీ డబుల్ డెక్కర్ వంతెనలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే, ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన మెట్రో డబుల్ డెక్కర్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

మొదటి దశ కింద కొమ్మాది-స్టీల్‌ప్లాంట్, గురుద్వారా-పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు అనే మూడు కారిడార్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. కొమ్మాది-స్టీల్‌ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్‌లోనే ఈ డబుల్ డెక్కర్ ట్రాక్ రానుంది. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిలోమీటర్ల మార్గంలో నిర్మించే డబుల్ డెక్కర్ వంతెన, ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలోని 8 పైవంతెనలను అనుసంధానిస్తూ ఒకే వంతెనగా రూపుదిద్దుకోనుంది. మరో డబుల్ డెక్కర్ వంతెన గాజువాక నుంచి స్టీల్‌ప్లాంటు మధ్య నిర్మించనున్నారు.
Go Back to Shorts
Visakha Metro
Vizag Metro
Double Decker Metro
APMRC
Ramakrishna Reddy
NHAI
Visakhapatnam
Metro Project
Infrastructure Project
Asia Metro

More Telugu News