ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలిని పరిశీలించిన మోదీ
  • పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ ను పరామర్శించిన ప్రధాని
అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో పర్యటించి, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, నేరుగా మేఘానీనగర్‌లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం, ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా నిన్న మోదీ పేర్కొన్నారు. "ఈ విషాదం మాటలకు అందనిది. ఈ దుఃఖ సమయంలో, బాధితులందరి గురించి నా ఆలోచనలు ఉన్నాయి. బాధితులకు సహాయం చేయడానికి మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను" అని ఆయన తెలిపారు. 


More Telugu News