విమాన ప్రమాదం.. స్పందించిన విదేశాంగ శాఖ

Air India Plane Crash in Ahmedabad Many feared dead
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ఎయిరిండియాకు చెందిన ఏఐ-171 విమానం లండన్‌కు బయలుదేరింది. అయితే, గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే ఈ విమానం అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

ఈ దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతి కలిగించే విషాదమని అన్నారు. "ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మరణించిన వారిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని ఆయన తెలిపారు.

ప్రమాదానికి సంబంధించిన తాజా వివరాలను సంబంధిత శాఖలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రాణనష్టంపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని, పూర్తి వివరాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని జైస్వాల్‌ వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
Go Back to Shorts
Air India
Air India crash
Ahmedabad
Gujarat
Plane crash
Vijay Rupani
Randeep Jaiswal

More Telugu News