హనీమూన్లో భర్త హత్య: భార్య సోనమ్ సహా ఐదుగురికి 8 రోజుల పోలీస్ కస్టడీ
- మేఘాలయ హనీమూన్లో భర్త రాజా రఘువంశీ హత్య
- ప్రధాన నిందితురాలు భార్య సోనమ్ రఘువంశీ అరెస్ట్
- సోనమ్తో పాటు మరో నలుగురికి కస్టడీ
- నిందితులందరికీ షిల్లాంగ్ కోర్టు 8 రోజుల పోలీస్ రిమాండ్
- సోహ్రాలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్న సిట్
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సయీమ్ మాట్లాడుతూ, "నిందితులందరినీ పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే, కోర్టు ఎనిమిది రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది" అని తెలిపారు. 24 ఏళ్ల సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్ట్ చేయగా, రాజా రఘువంశీ హత్యకు కుట్ర పన్నడం, అమలు చేయడంలో పాత్ర ఉందన్న ఆరోపణలపై మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ హత్య కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), సోహ్రాలోని ఘటనా స్థలంలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను పోలీస్ కస్టడీకి కోరినట్లు సదరు అధికారి వివరించారు. ఇండోర్లో అరెస్ట్ అయిన నిందితులకు సిట్ ఆరు రోజుల రిమాండ్, ఘాజీపూర్లో పట్టుబడిన వారికి మూడు రోజుల రిమాండ్ కోర్టు విధించినట్లు తెలిపారు.